Category : అంతర్జాతీయ | Sub Category : వార్తలు Posted on 2025-03-31 10:33:16
తెలుగు వెబ్ మీడియా న్యూస్: మరణంతో అంతా అయిపోయినట్టేనా? జీవితానికి ముగింపేనా?.. కానే కాదని, మరణాన్ని వెనక్కి తిప్పవచ్చని చెబుతున్నారు న్యూయార్క్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ సామ్ పార్నియా. గుండె, ఊపిరితిత్తులు పాడైపోయిన వారికి చికిత్సను అందించే ఎక్మా యంత్రంతో కొన్ని ఔషధాల సమ్మేళనాన్ని ఉపయోగించి ‘పోయిన ప్రాణాన్ని’ తిరిగి నిలబెట్టవచ్చని ఆయన పేర్కొంటున్నారు. ఎపినెఫ్రిన్, మధుమేహ చికిత్సలో వినియోగించే మెట్ఫార్మిన్, విటమిన్ సీ, వాసోప్రెసిన్, సప్లిమెంట్ సల్బుటమైన్.. వీటిని తగుపాళ్లలో కలిపి ఎక్మా మెషిన్తో కలిపి అందిస్తే.. గుండె స్తంభించిన వారిలో కూడా తిరిగి జీవం పోయవచ్చని సామ్ తెలిపారు.
ప్రయోగశాలలో జంతువుల మీద తాము జరిపిన ప్రయోగాల్లో ఇది సాధ్యమైందన్నారు. ‘మనిషి మరణించిన తర్వాత శరీరంలోని కణాలన్నీ వెంటనే చచ్చుబడిపోవు. దానికి కొంత సమయం పడుతుంది. మెదడు కూడా కొన్ని రోజులపాటు సజీవస్థితిలో ఉంటుంది. దీనిని సైన్స్ ఇప్పటికే నిరూపించింది. మేం జరిపిన కొన్ని పరిశోధనల్లో.. గుండెపోటుకు గురైన వ్యక్తుల్లో గుండె కొట్టుకోవటం మానేసిన తర్వాత కూడా దాదాపు గంటపాటు జ్ఞాపకాలు పదిలంగా ఉండటం గమనించాం. వారి మెదడు పనితీరును పరిశీలించినప్పుడూ ఇది నిజమేనని తేలింది’ అని సామ్ వివరించారు. మరణానికి గురైన వ్యక్తి శరీర కణాల్లో జీవక్రియలు పూర్తిగా నిలిచిపోనంత వరకూ ఆ వ్యక్తిని బతికించవచ్చని సామ్ పేర్కొన్నారు.