Responsive Header with Date and Time

త్వరలో కానిస్టేబుల్ నియామకాలు!

Category : | Sub Category : రాజకీయం Posted on 2024-07-31 11:02:55


త్వరలో కానిస్టేబుల్ నియామకాలు!

వైకాపా హయాంలో అర్ధంతరంగా ఆగిపోయిన వైనం నియామక ప్రక్రియ పునరుద్ధరణకు న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకోనున్న ఎన్డీయే ప్రభుత్వం ఆగస్టు నెలాఖరులోగా షెడ్యూల్ ఖరారుకు అవకాశం.

TWM News: వైకాపా హయాంలో ప్రకటనలకే పరిమితమై ఆరంభంలోనే అర్ధంతరంగా ఆగిపోయిన కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా చేపట్టేందుకు ఎన్డీయే ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించి న్యాయస్థానాల్లో గతంలో కొన్ని కేసులు దాఖలై ఉన్నందున వాటిపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుని తదుపరి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది. డీజీపీ సీహెచ్. ద్వారకా తిరుమలరావు, పోలీసు నియామక మండలి చైర్మన్ పీహెచ్ఎ రామకృష్ణ పలుమార్లు ఈ అంశంపై సమీక్షలు నిర్వహించారు. ఆగస్టు నెలాఖరులోగా నియామక ప్రక్రియ పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉంది.

ఏటా 6,500 చొప్పున పోలీసు ఉద్యోగాల్ని భర్తీ చేస్తామంటూ హామీ ఇచ్చిన నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిరుద్యోగుల్ని నట్టేట ముంచేశారు. ఆయన పాలనలో ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్క కానిస్టేబుల్ పోస్టూ భర్తీ చేయలేదు. నిరుద్యోగులను నిరీక్షింపజేసి చివరికి అధికారం చేపట్టిన మూడున్నరేళ్ల తర్వాత 2022 నవంబరు 28న 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ తర్వాత ఆయన మరో ఏడాదిన్నర పాటు అధికారంలో ఉన్నప్పటికీ నియామక ప్రక్రియ పూర్తి చేయలేకపోయారు. ప్రాథమిక రాత పరీక్ష (ప్రిలిమ్స్) నిర్వహించి, ఫలితాలు ప్రకటించినా.. ఆ తర్వాత దశల్లో నిర్వహించాల్సిన పరీక్షలను అతీగతీ లేకుండా వదిలేశారు. ఎన్డీయే ప్రభుత్వం ఆ నియామక ప్రక్రియ కొనసాగింపు బాధ్యత తీసుకుంది.


ప్రాథమిక రాత పరీక్షలో 95,208 మంది అర్హత
కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం గతేడాది జనవరి 22న నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షకు 4,58,219 మంది హాజరవ్వగా.. వారిలో 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. గతేడాది ఫిబ్రవరి 5న ఈ ఫలితాలు విడుదలయ్యాయి. వీరందరికీ ఆ వెంటనే రెండో దశలో దేహదారుఢ్య, శారీరక సామర్థ్య (పీఎంటీ, పీఈటీ) పరీక్షలు నిర్వహించాలి. గతేడాది మార్చి 13 నుంచి 20వ తేదీ వరకూ నిర్వహిస్తామంటూ తొలుత షెడ్యూల్ విడుదల చేసి హాల్ టికెట్లూ జారీ చేశారు. చివరికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సాకుతో వాయిదా వేశారు.

ఆ ఎన్నికలైపోయాక కూడా నియామక ప్రక్రియ కొనసాగించకుండా వైకాపా ప్రభుత్వం ఆపేసింది. దీంతో అసలు ఈ పరీక్షలు నిర్వహిస్తారో లేదో తెలియక అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నోటిఫికేషన్ జారీ కంటే రెండేళ్ల ముందు నుంచే అభ్యర్థులు ఈ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. వేరే పనులు చేసుకోలేక, ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో అర్థం కాక వారు మనోవేదనతో నలిగిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి ఊరట కలిగించేలా ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

వైకాపా హయాంలో మూడు నెలల్లోనే నియామక ప్రక్రియ పూర్తి..
అంతకు ముందు తెదేపా ప్రభుత్వ హయాంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం 2018 నవంబరు, డిసెంబరు నెలల్లో నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వాటికి సంబంధించిన ప్రాథమిక రాత పరీక్ష,దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షలు, తుది రాత పరీక్ష అన్ని కేవలం మూడు నెలల వ్యవధిలో 2019 ఫిబ్రవరి నాటికే పూర్తి చేశారు. ఇప్పుడు కూడా అదే వేగంతో నియామక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
Leave a Comment: