Category : అంతర్జాతీయ | Sub Category : వార్తలు Posted on 2025-04-29 11:08:30
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇప్పటికే సింధూ జలాల ఒప్పందం నిలిపివేసిన భారత్ ఏ క్షణమైనా ఉగ్రమూకలకు సాయం చేసిన వారికి గట్టి బుద్ధిచెప్పాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రధాని మోదీ, రక్షణమంత్రి సమావేశం సహా సైనికాధికారులతో వరుసగా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ రక్షణశాఖ మంత్రి ఖవాజా మహమ్మద్ అసీఫ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రదాడికి భారత్ సైన్యం ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
భారత్ ప్రతీకార దాడి తర్వలోనే జరిగే అవకాశం ఉందని, ఇదే విషయాన్ని పాక్ ప్రభుత్వానికి ఆర్మీ నివేదించినట్టు మంత్రి ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. భారత్ దాడి చేసే అవకాశం ఉన్నందున సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరిస్తున్నట్టు వివరించారు. అణ్వాయుధాల విషయంలో పాకిస్థాన్ అత్యంత అప్రమత్తంగా ఉందని, ప్రత్యక్ష ముప్పు ఏర్పడితే వాటిని వినియోగిస్తుందని ఆయన చెప్పారు. తుర్కియేకు చెందిన C-130 హెర్క్యూలస్ విమానాలు ఇస్లామాబాద్కు చేరినట్టు చెప్పారు. ఈ విమానాల్లో పాక్ సైన్యానికి అవసరమైన సామగ్రి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.
భారత్ వస్తువుల విషయంలో చర్యలు
మరోవైపు భారత వస్తువులు పరోక్షంగా పాకిస్థాన్ చేరకుండా అడ్డుకునేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం కస్టమ్స్, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్లు, ఇతర విభాగాల నుంచి ఎగుమతి డేటాను కేంద్రం సేకరిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) ప్రకారం దుబాయ్, సింగపూర్, కొలంబో వంటి ఓడరేవుల ద్వారా ఏటా పరోక్షంగా 10 బిలియన్ డాలర్ల విలువైన భారతీయ వస్తువులు పాకిస్థాన్కు చేరుకుంటున్నాయి. భారత వస్తువులు ఈ ఓడరేవులకు వెళ్తుండగా ఒక స్వతంత్ర సంస్థ సరుకులను ఆఫ్లోడ్ చేసి, ఉత్పత్తులను బాండెడ్ గిడ్డంగులలో ఉంచుతున్నట్టు తెలుస్తోంది. అందులో లేబుల్లు, పత్రాలు వేరే దేశాన్ని చూపించేలా సవరిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో భారత వస్తువులు పరోక్షంగా పాక్కు చేరకుండా భారత్ యత్నిస్తోంది. భారత్కు విమాన మార్గాన్ని పాక్ మూసివేయడం వల్ల పశ్చిమాసియా దేశాలకు భారత్ పంపే వస్తువుల రవాణాకు కేంద్రం ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తోంది.