Category : | Sub Category : క్రీడా Posted on 2024-09-16 15:09:36
టీం ఇండియాతో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు భారత్ చేరుకుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం మైదానంలో ఇరు జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నజ్ముల్ హసన్ శాంటో నేతృత్వంలో 15 మంది సభ్యుల బంగ్లాదేశ్ జట్టు భారత్లోకి అడుగు పెట్టింది.సోమవారం (సెప్టెంబర్ 16) తెల్లవారుజామున ఢాకా నుంచి బయల్దేరిన బంగ్లాదేశ్ జట్టు కొన్ని గంటల క్రితమే చెన్నైలో దిగింది. తొలి టెస్టు మ్యాచ్కు టీమిండియా ఇప్పటికే చెమటోడ్చుతుండగా.. ఇప్పుడు చెన్నైలో అడుగుపెట్టిన బంగ్లాదేశ్ జట్టు మంగళవారం (సెప్టెంబర్ 17) నుంచి ప్రాక్టీస్ ప్రారంభించనుంది.ఇటీవల బంగ్లాదేశ్ జట్టు పాకిస్థాన్తో జరిగిన రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. పాక్ పై ఆ జట్టు టెస్ట్ సిరీస్ గెలవడం ఇదే మొదటిసారి. దీంతో బంగ్లాదేశ్ జట్టు ఇప్పుడు నూతనోత్సాహంతో ఉంది. ఇదే కోవలో టీమిండియాను కూడా ఓడించాలని బంగ్లా పులులు ధీమాతో ఉన్నారు.
భారత్లో దిగడానికి ముందు బంగ్లాదేశ్లో జరిగిన విలేకరుల సమావేశంలో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హసన్ శాంటో మాట్లాడుతూ, టెస్ట్ సిరీస్లో జట్టు నుంచి మంచి ప్రదర్శన ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. \"ఇది ఖచ్చితంగా మాకు చాలా సవాలుతో కూడిన సిరీస్. ఒక మంచి సిరీస్ (పాకిస్థాన్పై) తర్వాత, మా పై అభిమానుల అంచనాలు పెరిగిపోయాయి. ప్రతి సిరీస్ ఒక్కో అవకాశం. రెండు గేమ్లు గెలవడానికి ఆడతాం. ర్యాంకింగ్లో టీమిండియా మనకంటే ముందుంది. కానీ ఇటీవల మేం మంచి ప్రదర్శన చేశాం. ఐదు రోజులు బాగా ఆడాలన్నదే మా లక్ష్యం’ అని చెప్పుకొచ్చాడు.భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇప్పటి వరకు మొత్తం 13 టెస్టు మ్యాచ్లు జరిగాయి. వీటిలో 11 మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించింది. మిగతా 2 టెస్టు మ్యాచ్లు డ్రా అయ్యాయి. అంటే బంగ్లాదేశ్ జట్టు ఇప్పటి వరకు భారత్తో టెస్టు మ్యాచ్లో విజయం సాధించలేకపోయింది.టెస్ట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు: నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), జకీర్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షాద్మాన్ ఇస్లాం, షకీబ్ అల్ హసన్, మెహదీ హసన్ మిరాజ్, జఖర్ అలీ అనిక్, తస్కిన్ అహ్మద్, లిటన్ దాస్, హసన్ మహమూద్, తైజుల్ ఇస్లాం, మహ్మదుల్ హసన్ జాయ్, ఖలీద్ అహ్మద్.