Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2024-09-19 11:21:32
ఈ నెల 20 నుంచి ప్రజల్లోకి వెళ్లాం 2047కల్లా 15% వృద్ధిరేటు సాధించాలి ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు.
తెలుగు వెబ్ మీడియా న్యూస్: మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని దీపావళి రోజు ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. వందరోజుల్లో సాధించిన ప్రగతి.. భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలు, నేతలకు సూచించారు. మంగళగిరిలో బుధవారం నిర్వహించిన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చేసిన మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్లాం. కోట్లమంది ప్రజలు మనపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. వారిని దృష్టిలో పెట్టుకుని కక్షసాధింపు చర్యలకు తావులేకుండా ఉండాలి. అలాగని తప్పులు చేసినవారిని ఉపేక్షించం. చట్టప్రకారం వారిపై చర్యలు ఉంటాయి అని ఎన్డీయే ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలతో ప్రజలకు చేకూరిన లబ్ధిని ఈ నెల 20 నుంచి ఆరురోజుల పాటు వివరించాలన్నారు. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీ చేసే విషప్రచారాలను తిప్పికొట్టేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు.
సమన్వయంతో పనిచేద్దాం
ఎన్నికల ముందు.. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన వందరోజుల్లో మూడు పార్టీల సమన్వయం అమోఘంగా ఉందని చంద్రబాబు ప్రశంసించారు. ఇదే సమన్వయం నియోజకవర్గ స్థాయిలో కూడా ఉండేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉందన్నారు. దీని కోసం త్వరలో ప్లానింగ్ బోర్డు మంత్రిని నియమిస్తాం. టీడీపీ, జనసేన, బీజేపీలను ఆయన సమన్వయం చేస్తారు. ఆయా పార్టీల జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కీలకంగా వ్యవహరించాలి. అందరి సమన్వయంతో వంద రోజుల్లో వెయ్యి అడుగులు ముందుకెళ్లాం. రాబోయే రోజుల్లో అడుగుల వేగం ఇంకా పెరుగుతుంది అని పేర్కొన్నారు. ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు వివరించేందుకు ప్రతి నెలా 10రోజుల పాటు ఎమ్మెల్యేలు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.
రాష్ట్రాభివృద్ధికి.. కేంద్ర పథకాలతో సమన్వయం
ప్రధాని మోదీ వికసిత్ భారత్ 2047 లక్ష్యాలతో పనిచేస్తున్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించేలా వివిధ పథకాలను కేంద్రం అమలుచేయనుంది. వాటిని అందిపుచ్చుకుని స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ను 15% వృద్ధిరేటు లక్ష్యంతో రాష్ట్రస్థాయిలో రూపొందిస్తున్నాం. నియోజకవర్గ స్థాయిలో విజన్ డాక్యుమెంట్ ల తయారీపై ఎమ్మెల్యేలు ఆలోచించాలి. జలజీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికీ కుళాయి నీరు కేంద్ర భాగస్వామ్యంతో అందిస్తాం. రాష్ట్ర రహదారులపై గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిర్వహిస్తాం. ఆ తర్వాత రోడ్ల అభివృద్ధికి శాశ్వత పరిష్కారంపై ఆలోచిస్తాం. ఒకేరోజు అన్ని పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి రూ.4,500 కోట్లతో పనులను గుర్తించడం ఒక రికార్డు. ఈ పనులను కేంద్ర భాగస్వామ్య పథకాల అనుసంధానం ద్వారా పూర్తిచేస్తాం.
వరద బాధితులకు అత్యధిక పరిహారం
వరద బాధితులకు 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనంత అత్యధిక పరిహారాన్ని ప్రకటించాం. బాధితులను ఆదుకునేందుకు వివిధ వర్గాలు సీఎం సహాయనిధికి రూ.350 కోట్ల విరాళాలను అందించాయి. ఎన్డీయే ఎమ్మెల్యేలు కూడా ఒకనెల జీతాన్ని సీఎం సహాయనిధికి విరాళంగా ఇద్దాం. గత ప్రభుత్వం విపత్తుల నిధిలో రూ.2000 కోట్లు ఉన్నట్లు లెక్కల్లో చూపింది. నిధులు మొత్తం ఖాళీచేసింది.